కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ సునీతారెడ్డి పోస్టర్ల కలకలం

  • రాజకీయాల్లోకి వస్తున్న సునీతమ్మకు స్వాగతం అంటూ పోస్టర్లు
  • ప్రొద్దుటూరు కూడళ్లలో అంటించిన గుర్తు తెలియని వ్యక్తులు
  • పసుపు రంగులో, టీడీపీ నేతల ఫొటోలతో ముద్రించిన వైనం
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు వైఎస్ సునీతారెడ్డి. నిందితులకు శిక్ష పడాలంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఇప్పుడు ఆమె విషయంలో కడప జిల్లాలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

వైఎస్ సునీతారెడ్డి రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు కడప జిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. ‘రాజకీయాల్లోకి వస్తున్న వైఎస్ సునీతమ్మకు స్వాగతం’ అంటూ.. పసుపు రంగులో, తెలుగుదేశం పార్టీ నేతల ఫొటోలతో ప్రొద్దుటూరు ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు, కీలక నేతలు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, బీటెక్ రవి, శ్రీనివాసులరెడ్డితో పాటు వైఎస్ వివేకా ఫోటో కూడా ఉంది.

టీడీపీ నేతలతో సునీతారెడ్డి టచ్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా వైఎస్సార్‌సీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పోస్టర్లు కలకలం రేపాయి. అయితే ఈ పోస్టర్లు ఎవరు అంటించారన్నది క్లారిటీ లేదు. పోస్టర్లపై ఎక్కడా ఊరు పేరు లేదు. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి పోస్టర్లను అంటించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు కూడా వ్యవహారంపై ఆరా తీస్తున్నారట. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

ys sunitha reddy
proddatur
posters on sunitha reddy
YS Vivekananda Reddy
viveka murder case

More Telugu News